కలెక్టరేట్, జనవరి 29: రెండో విడతలో దళితబంధు పథకానికి ఎంపికై, యూనిట్లు నిర్వహించుకుంటున్న తమకు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. తమ ఖాతాల్లో జమయిన రెండో విడత డబ్బుల ఫ్రీజింగ్ను వెంటనే ఎత్తేయాలని కోరారు. అదనపు కలెక్టర్లను కలిసిన వారిలో లబ్ధిదారులు బండ రాజమ్మ, పులి నరేశ్, పోచంపల్లి శ్రీనివాస్, పులి లచ్చయ్య, ములుగు సమ్మయ్య తదితరులు ఉన్నారు.