హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారుల (స్ట్రీట్ వెండర్స్)కు చేయూతనందిస్తున్న ప్రభుత్వం అర్హులైన వారికి రెండో విడత రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు సూచించింది. ఇప్పటివరకు 1.02 లక్షల మందికి రుణాలు అందించగా, మరో 1.52 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ ఆఖరుకల్లా రుణ మొత్తాన్ని అందించాలని కోరింది. రెండో విడుత రుణం తీసుకొనే వారు మొదటి విడత రుణా న్ని సకాలంలో చెల్లించాలని పేర్కొన్నది. రెండోవిడుత రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి మూడో విడుత రుణాన్ని కూడా అందించనున్నారు. వీధి వ్యాపారులకు రుణాల మంజూరులోతెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 5.22 లక్షల మందికి రూ.522 కోట్ల రుణం అందజేశారు.