హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ యాత్ర రైలు ప్రారంభం కానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఆ రైలు నడుస్తుందని పేర్కొన్నారు.
అరుణాచలం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరును కలుపుతూ ఈ యాత్ర సాగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, ఏపీలోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరుతోపాటు రేణిగుంట స్టేషన్లో ప్రయాణికులు ఎక్కి దిగే సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 31 వరకు యాత్ర కొనసాగుతుందన్నారు.