హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్/మన్సూరాబాద్: తెలంగాణసహా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) గురువారం సోదాలు నిర్వహించింది. మోస్ట్వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు, వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీ, సౌత్ రీజినల్ బ్యూరో ఇన్చార్జి సంజయ్ దీపక్రావు అలియాస్ అనిల్ను గత సెప్టెంబర్లో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించగా, తమిళనా డు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన పలువురు పేర్లను వెల్లడించారు. ఆ సమాచారం ఆధారంగా గురువారం తెల్లవారుజామున 4 గంటలకే హైదరాబాద్లో నారాయణగూడ, ఎల్బీనగర్.. థానే, చెన్నై, మల్లాపురం, పాలక్కాడ్లో మొత్తం ఆరుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
తెలంగాణకు చెందిన వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ను కలువాలనుకున్నట్టు దీపక్రావు తన డైరీలో రాసుకోవడంతో నారాయణగూడలోని వేణుగోపాల్ ఇంట్లో, ఎల్బీనగర్లోని రవిశర్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. వీరిద్దరి నుంచి ఫోన్లు, పలు డిజిటల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుచోట్ల సుమారు ఐదుగంటలపాటు విస్తృతంగా సోదాలు జరిపారు. అనంతరం నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సాహిత్యం, ఆరుఫోన్లు, సిమ్కార్డులు, రూ.1,37,210 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాలని రవిశర్మకు సూచించారు. కేసు విచారణలో ఉన్నదని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
‘ఇదొక అబద్ధపు కేసు. ఎటు వెళ్తుందో తెలియదు. సోదాల అనంతరం నాఫోన్ తీసుకెళ్లారు. దాని ఆధారంగా ఏం చేస్తారో తెలియదు. నా ఫోన్లో ఉన్న సమామాచారాన్ని ఎలా వాడతారో తెలియదు. ఇవన్నీ ప్రజలు గమనించాలి’ అని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ కోరారు. ఎన్ఐఏ సోదాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఐఏ సోదాల అనంతరం రవిశర్మ కూడా మీడియాతో మాట్లాడారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టంచేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఏ అధికారులు తమ ఇంట్లో తనిఖీలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ఇప్పుడూ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు.
మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్ శివగంధనగర్కు చెందిన సంజయ్కుమార్ తండ్రి కమ్యూనిస్టు పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ నేత. సంజయ్ జమ్ము కశ్మీర్లోని ఎన్ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాడు. వామపక్ష తీవ్రవాదం వైపు ఆకర్షితుడై కశ్మీర్లోని వేర్పాటువాద ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. 1999లో సీపీఐఎంఎల్కు చెందిన సీఆర్సీ రవూఫ్ గ్రూపులో పనిచేశాడు. మహారాష్ట్ర రాష్ట్ర సీపీఐ ఎంఎల్ నక్సల్బరీ గ్రూప్కు ఇన్చార్జ్గా పనిచేశాడు. ఆ తర్వాత 2000 జూలైలో నందుర్బార్ జిల్లాకు చెందిన సహధా పోలీసులకు చిక్కాడు. 2002 నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో నక్సల్బరీ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేశాడు. 2005లో అనంతపురం జిల్లా, మలనూరు పోలీసులు, కర్ణాటక పోలీసులు అరెస్టు చేయగా.. మళ్లీ 2006లో విడుదలయ్యాడు. 2007లో నుంచి కోలార్మైన్స్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అనంతపురానికి చెందిన సరస్వతి అలియాస్ మాధవి ఉరఫ్ పార్వతిని పెండ్లి చేసుకున్నాడు.