హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు ప్రజలను నానా అవస్థలకు గురిచేశాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రజల ప్రాణాలు కాపాడిన తీరు ప్రశంసలు కురిపిస్తున్నది. చెరువులు, కాల్వలు పొంగి బ్రిడ్జిలు, కల్వర్టుల మీదుగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసిన పోలీసులు రాత్రింబవళ్లు అక్కడ కాపుకాశారు. వరదల్లో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో రక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 131 వరద ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలకంగా వ్యవహరించారు. దాదాపు 19 వేల మందిని 4,996 పునరావాస కేంద్రాలకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నారు. బస్సుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగునీరు అందించడంలో సాయం చేశారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ వరదల్లో గల్లంతై చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి బాధిత కుటుంబ సభ్యులకు అందించడంలో కీలకంగా వ్యవహరించారు. వరద సహాయక చర్యల్లో పోలీసులు చేసిన సేవలను కొనియాడుతూ డీజీపీ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు రెస్క్యూ దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేస్తూ సిబ్బందిని ప్రోత్సహించారు. వరదల్లో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా విశేష సేవలు అందించాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 బృందాలను మోహరించి లోతట్టు ప్రాంతాలు, వరదల్లో చిక్కుకుపోయిన దాదాపు 2 వేల మందిని బోట్ల సాయంతో రక్షించారు. మోరంచపల్లి, మంథని, నిర్మల్, ములుగు, ఖమ్మం, వరంగల్, హనుమకొండలో భారీ వరదల్లో చిక్కుకున్న సుమారు 150 మందిని బోట్లతో కాపాడారు.