హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపకశాఖ విశేష సేవలు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 150 మందిని మోహరించి వరదలు, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 788 మందిని బోట్ల సాయంతో రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించింది. జలదిగ్బంధంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన భూపాలపల్లి జిలా మోరంచపల్లి ప్రజలను అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు.
ఏడీజీ నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం ఎన్డీఆర్ఎఫ్, హెలికాప్టర్ల కంటే ముందే గ్రామానికి చేరుకుని వృద్ధులు, చిన్నారులు సహా 70 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్పూర్లో ఇసుక రీచ్లో చిక్కుకున్న 19 మందిని కాపాడారు. నిర్మల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతంలో చిక్కుకున్న 100 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. వరదలు అదుపులోకి వచ్చేంత వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని నాగిరెడ్డి తెలిపారు.