SCR | పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో 280 మందికిపైగా మృతి చెందగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. రైలు ప్రమాదంలో టాక్ మొత్తం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అయితే, ఘటన తర్వాత వందలాది మంది కార్మికులు రాత్రింభవళ్లు కష్టపడి ట్రాక్ పునరుద్ధరణ చేపట్టడంతో దాదాపు 50 గంటల తర్వాత మళ్లీ మార్గంలో రైలు ప్రయాణాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ట్రాక్ పనులు కొనసాగుతుండడంతో హౌరా వైపు రాకపోకలు సాగించే పలు ట్రైన్స్ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు నడిచే 15 రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. అయితే, 12న చెన్నై సెంట్రల్ -షాలిమార్ (ట్రైన్ నం. 12842) ట్రైన్ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన రైళ్లలో ఈ నెల 11న మైసూరు- హౌరా (రైలు నంబర్ 22818), 12న హైదరాబాద్-షాలిమార్ (ట్రైన్ నంబర్ 18046), ఎర్నాకుళం-హౌరా (ట్రైన్ 22878), సంత్రగాచి-తంబరం(22841), హౌరా-చెన్నై సెంట్రల్ (రైలు నంబర్ 12839)తో పాటు తదితర రైళ్లను రద్దు చేసినట్లు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో రాకేశ్ ప్రకటనలో పేర్కొన్నారు.