హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల ఆదాయం రూ.20 వేల కోట్లను అధిగమించి, రూ.20,338 కోట్లను నమోదు చేసింది. ఇంతటి ఆదాయం రావడం ఎస్సీఆర్ జోన్ చరిత్రలో ఇదే తొలిసారని బుధవారం రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 117 రైళ్లలో 6,921 అదనపు బోగీలు ఏర్పాటు చేయడంతో రూ. 5,731.8కోట్ల వరకు ఆదాయం వచ్చిందన్నారు. 2022-23లో 255.59 మిలియన్ల మంది ప్రయాణిస్తే, 2023 -24లో 262.62 మిలియన్ల మంది ప్రయాణం చేసినట్టు వివరించారు. సరుకు రవాణా విభాగంలో రూ. 13,620 కోట్ల స్థూల ఆదాయం సాధించిందని, ఇది గత ఏడాదితో పోల్చితే ఈ సారి 4.4శాతం అధికమని తెలిపారు. కోచింగ్ విభాగాల్లో రూ.512 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని పేర్కొన్నారు. రైల్వే ఆధ్వర్యంలో వివిధ మార్గాల ద్వారా రూ.474 కోట్ల ఆదాయం నమోదైందని వెల్లడించారు.