హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్లీ తెరిచేలోపు పనులను పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న బడులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియగా, ఇప్పటికే కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. కాలేజీలు జూన్ 1 నుంచి పున ః ప్రారంభమవుతాయి. ఈ సెలవు రోజుల్లో సర్కారు బడులు, జూనియర్ కాలేజీలు, డిగ్రీకాలేజీల్లో పనులు చేపట్టేందుకు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులు టెండర్లు పిలిచారు.