హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల విరామం తర్వాత సోమవారం బడులు పునఃప్రారంభం కానున్నాయి. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. స్కూళ్లను శుభ్రంచేసి 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభానికి సిద్ధంచేశారు. వాస్తవానికి పాఠశాలలు జూన్ 12న తిరిగి తెరుచుకోవాల్సి ఉన్నది. ఎండ తీవ్రత నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని జూన్ 15కు వాయిదా వేశారు.
పునఃప్రారంభం వాయిదాతో కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు జూలై 11 (రెండో శనివారం)ను పనిదినంగా పరిగణించాలని నిర్ణయించారు. 2026-27 విద్యాసంవత్సరంలో పాఠశాలలకు 227 పనిదినాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూలై 31 నాటికి మొదటి, సెప్టెంబర్ 21 నాటికి ద్వితీయ, డిసెంబర్ 10 నాటికి తృతీయ నిర్మాణాత్మక మూల్యంకనాలు పూర్తిచేయాలని నిర్దేశించారు.
విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, 2027 జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 23ను చివరి పనిదినంగా నిర్ణయించారు. 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.