స్టేషన్ ఘన్పూర్ : ఈ చిత్రంలో ఓ తండ్రి తన పిల్లలను బడికి తీసుకెళ్తున్నారని అనుకొంటున్నారా! పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా ఆమ్లేట్ తండా కచ్చర్ల తండాలోని ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలో ధరావత్ చంద్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.. అయితే ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు కేవలం 17 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు.
బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకొని తోటి ఉపాధ్యాయుడు లక్ష్మణ్తో కలిసి ఇంటింటికి వెళ్లారు. కూలీనాలీ చేసుకొనే ఆ తల్లిదండ్రులు వీలుకాక పిల్లలను బడికి పంపించట్లేదని తెలుసుకొన్నారు. రోజూ తనే పిల్లలను బడికి తీసుకెళ్లి, ఇంటివద్ద దింపుతానని వారికి భరోసా ఇచ్చారు. నిత్యం విద్యార్థులను తన బండిపైనే ఉదయం బడికి తీసుకొచ్చి, సాయంత్రం ఇంటివద్ద విడిచిపెడుతున్నారు.