Mana Ooru Mana Badi | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : ‘మన ఊరు- మనబడి, మన బస్తీ-మన బడి పథకం’ కింద మొదటి విడతలో ఎంపికైన ప్రతి బడిలో తాతాలిక వాచ్మన్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేసవి సెలవుల్లో శౌచాలయాలు, తాగునీటి ట్యాంకు, సోలార్ పీవీ సిస్టమ్, డైనింగ్ హాళ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, డ్యూయల్ డెస్క్ బల్లలు తదితరాల రక్షణ దృష్ట్యా వాచ్మెన్ను నియమిస్తున్నట్టు తెలిపారు.
ఈ నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు, విద్యాశాఖ మంత్రి సబితకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి ఆర్ రాజుగంగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.