తెలంగాణలో కంపెనీని విస్తరిస్తాం
త్వరలోనే యూనిట్ను ప్రారంభిస్తాం
మరో 1,000 మందికి ఉద్యోగాలు
కేటీఆర్తో కంపెనీ ప్రతినిధి భేటీ
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రశంసలు
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్.. రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా బుధవారం దావోస్లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ సమావేశమై నూతన యూనిట్ ఏర్పాటు ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తమ యూనిట్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా డబ్ల్యూఈఎఫ్లో అడ్వాన్స్డ్ లైట్ హౌస్ అవార్డును దక్కించుకొన్నదని తెలిపారు.
ఐఐవోటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రిడిక్టివ్/ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ఏఐ డీప్ లర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వాడినందుకు ఈ అవార్డు దక్కిందని వెల్లడించారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణంపై రిమోంట్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్టు వివరించారు.
తెలంగాణను పెట్టుబడుల రాజధానిగా మార్చేందుకు కృషి
తెలంగాణను పెట్టుబడుల రాజధానిగా మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రయత్నంలో భాగంగా ష్నైడర్ ఎలక్ట్రిక్ తమ తయారీ పరిశ్రమను విస్తరిస్తామని చెప్పటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త యూనిట్ వల్ల కొత్తగా 1,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్న ష్నైడర్ కంపెనీకి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.