రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మార్కెటింగ్ లో మిరప రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించింది. రైతుల కల్లాల వద్దే తేజ రకం ఎండు మిర్చి కొనుగోలుకు సెర్ప్ను రంగంలోకి దింపింది. ఇప్పటికే సెర్ప్ కేరళకు చెందిన ప్లాంట్ లిపిడ్స్ కంపెనీతో అవగాహన కుదుర్చుకున్నది. ఈ ఏడాది ఆరు జిల్లాల్లో మిర్చి కొనుగోలుకు శ్రీకారం చుట్టింది.
వరంగల్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): గతేడాది ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లాలో మహిళా సంఘాల ద్వారా రైతుల కల్లాల వద్దే తేజ రకం ఎండు మిర్చి కొనుగోలుకు తెలంగాణ సర్కారు చొరవ తీసుకున్నది. ఇందు కోసం గ్రామస్థాయి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కల్లాల వద్ద కేరళ రాష్ర్టానికి చెందిన ప్లాంట్ లిపిడ్స్ కంపెనీకి తేజ రకం ఎండు మిర్చిని రైతులు అమ్ముకున్నారు.
వారికి మార్కెట్ కంటే మంచి ధర లభించింది. ఖమ్మం జిల్లాలో రైతుల కల్లాల వద్ద కొనుగోలు చేసిన తేజ రకం ఎండు మిర్చిని ప్లాంట్ లిపిడ్స్ కంపెనీ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి వద్ద ఉన్న తమ ఫ్యాక్టరీకి తరలించింది. ఇక్కడే సదరు కంపెనీకి ల్యాబ్ కూడా ఉన్నది. కలర్, లిక్విడ్ తదితర అవసరాల కోసం వినియోగించే తేజ రకం ఎండు మిర్చిని ఆ కంపెనీ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నది.
మరో ఐదు జిల్లాలకు విస్తరణ
ఖమ్మం జిల్లాలో మంచి ఫలితాలు కనపడటంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రాష్ట్రంలో మిర్చి సాగు ఎక్కువగా జరిగే ఖమ్మం సహా మరో ఆరు జిల్లాలకు విస్తరించింది. ఈ ఏడాది ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లా ల్లో రైతుల కల్లాల వద్ద తేజ రకం ఎండుమిర్చి కొనుగోలుకు నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్ అధికారులు కేరళ రాష్ర్టానికి చెందిన ప్లాంటు లిపిడ్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇటీవల ఆరు జిల్లాల్లో ఆ కం పెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. గ్రామై క్య సంఘాల(వీవో)తో కలిసి ఆరు జిల్లాల్లో నూ ప్లాంటు లిపిడ్ కంపెనీ ప్రతినిధులు మిర్చి సాగు విస్తీర్ణంపై సర్వే జరిపారు. ఆరు జిల్లాల్లో ఈ ఏడాది దిగుబడులపై అంచనాలు వేశారు. జిల్లా వారీగా పంట సాగు విస్తీర్ణం, దిగుబడులపై ఒక నివేదిక తయారు చేసి సెర్ప్ అధికారులకు అందజేశారు. దీంతో త్వరలోనే రైతుల మిరప కల్లాల వద్ద తేజ రకం ఎండుమిర్చి కొనుగోళ్లు చేపట్టేందుకు గ్రామ స్థాయి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సెర్ప్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. స్థానిక మహిళా సం ఘాల ద్వారా వీటిని తేజ రకం మిర్చి పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
కల్లాల వద్దే గ్రేడింగ్, ధర నిర్ణయం
మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి ప్లాం ట్ లిపిడ్స్ కంపెనీ ప్రతినిధులు తేజ రకం ఎండు మిర్చి కల్లాలను సందర్శించి అక్కడే మిర్చి గ్రేడింగ్పై ధర నిర్ణయిస్తారు. మంచి క్వాలిటీ ఉన్న తేజ రకం ఎండుమిర్చికి డీలక్స్ రేటు, మచ్చ, తాలు ఉన్న మిర్చికి మరో రేటు ప్రకటిం చి సంబంధిత రైతులకు కల్లం వద్దే టోకెన్ ఇస్తా రు. టోకెన్ పొందిన రైతుల మిర్చిని రెండు రో జుల వ్యవధిలో తూకం వేసి తీసుకెళ్తారు. తమ కు మిర్చి అమ్మిన రైతులకు ఏడు పనిదినాల్లోపు డబ్బు చెల్లిస్తారు. రైతుల కల్లాల వద్ద మిర్చి కొనుగోలులో సహకరించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం కమీషన్ ఇవ్వనుంది. రైతులు తేజ రకం మిర్చిని గ్రేడింగ్పై మహిళా సంఘాలకు సెర్ప్ అధికారులు శిక్షణ ఇస్తున్నారు.
వరంగల్లో మహిళా సంఘాలకు శిక్షణ
మహిళా సంఘాల ద్వారా రైతుల కల్లాల వద్ద తేజ రకం ఎండు మిర్చి కొనుగోలుకు గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లాలో తేజ రకం ఎండుమిర్చి కొనుగోలులో పాల్గొనే మహిళా సంఘాలకు ఈ నెల 17న శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎం సంపత్రావు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది ఆరు మండలాల్లో సుమారు 21 వేల క్వింటాళ్లకు పైగా తేజ రకం ఎండుమిర్చిని రైతుల నుంచి కల్లాల వద్ద కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఆయన తెలిపారు.
మార్కెటింగ్ సమస్యలకు చెక్
వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారులు తేజ రకం ఎండుమిర్చికి వేలం ద్వారా ధరలు నిర్ణయిస్తారు. దీంతో ఏదో ఒక రైతు మిర్చికి జెండా పాట కింద గరిష్ఠ ధర పలుకుతుంది. ఇతర రైతుల మిర్చికి మాడల్, కనిష్ఠ ధర లభిస్తుంది. మాడల్, కనిష్ఠ ధరతో అమ్మడం ఇష్టం లేని రైతులు మార్కెట్కు తెచ్చిన తమ మిర్చిని తిరిగి ఇంటికి తీసుకెళ్తే రవాణా ఖర్చులు భరించాల్సి వస్తుందని, ఖరీదుదారులు నిర్ణయించిన ధరకే అమ్ముతున్నారు. మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారులు తీరా తరుగు పేరుతో తూకంలో కోత పెడుతున్నారు. ఖరీదుదారుల ద్వారా అమ్మించినందుకు అడ్తీదారులు రైతుల నుంచి కమీషన్ తీసుకుంటున్నారు. రైతులకు డబ్బు చెల్లింపులోనూ జాప్యం జరుగుతుంది. సర్కారు నిర్ణయం ద్వారా రైతుల కల్లాల వద్ద కొనుగోళ్లు జరిగితే మార్కెటింగ్లో రైతులకు ఎదురవుతున్న సమస్యలకు తెర పడుతుంది.