హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దసరా సెలవులు తగ్గించడం లేదా రెండో శనివారాల్లోనూ పాఠశాలలను నడిపేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనకు మంగళవారం లేఖరాశారు. భారీ వర్షాలతో జూలై 7 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు జాతీయ సమైక్యత ఉత్సవాల నేపథ్యంలో 2022 -23 విద్యాసంవత్సరం 7 రోజులు నష్టపోయిందని లేఖలో ప్రస్తావించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మొత్తం పని దినాలు 230 కాగా, జరిగిన నష్టాన్ని పూరించేందుకు పై రెండు ప్రతిపాదనలను సమర్పించారు.