హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలోని తాడిచెర్ల బొగ్గుగనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించే ఆలోచనను విరమించుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్చేశారు. తాడిచర్ల సింగరేణి బొగ్గును భూపాలపల్లిలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కోసమే వినియోగించాలని స్పష్టంచేశారు. తాడిచర్ల బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్రంలోని కొంతమంది పెద్దలు రాష్ట్ర సింగరేణి అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉన్నదనే కారణంతో ఇకడి బొగ్గును తరలించి భూపాలపల్లి ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలిగిస్తే ఎలా? అని కేంద్రాన్ని నిలదీశారు.