దామెర, డిసెంబర్ 16: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం ఆయన హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తిలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకు మెగా డీఎస్సీ వేయబోతున్నామని చెబుతున్న ప్రభుత్వం ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచాలని, తద్వారా ఆయా వర్గాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చి తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు.
లేకుంటే చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని చెప్పారు. ఇష్టానుసారం ఉద్యోగ నియామకాలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వక ముందే రిజర్వేషన్ల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని, ఇచ్చిన హామీలను విస్మరిస్తే వాటిని గుర్తించి ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. బడ్జెట్కు సంబంధం లేని అంశాలపై జీవోలు తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. దాని వల్ల పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత కొరవడిందని, అగ్రవర్ణాలకే పెద్దపీట వేశారని ఆరోపించారు. 12శాతానికిపైగా జనాభా ఉన్న మైనార్టీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు.