హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన అభిషేక్ బోయినపల్లికి ఊరట లభించింది. 19 నెలల నుంచి జైలులో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈమేరకు సుప్రీం కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ భార్యకు చికిత్స చేయించేందుకు వీలుగా సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
ఇదే సమయంలో అభిషేక్ పాస్పోర్టును సరెండర్ చేయాలని, ఆయన భార్యకు హైదరాబాద్లోనే చికిత్స చేయించాలని షరతులు విధించింది. బెయిల్పై విడుదలయ్యే ముందు అభిషేక్ తన మొబైల్ నంబర్ను ఈడీ అధికారులకు ఇవ్వాలని, తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈడీ అధికారులకు తెలియజేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది.
నాలుగో రోజూ కవితను ప్రశ్నించిన ఈడీ
ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు బుధవారం సాయంత్రం కవితను కలిశారు.
కవిత వ్యక్తిగత సిబ్బంది విచారణ..
కవిత వ్యక్తిగత సిబ్బంది రాజేశ్, రోహిత్లను బుధవారం ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. కవిత అరెస్టు సమయంలో వారు ఆమె నివాసంలోనే ఉన్న విషయం తెల్సిందే. కవిత అరెస్టు సందర్భంగా వారి ఫోన్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను బుధవారం వారి సమక్షంలోనే అన్లాక్ చేశారు. అనంతరం పలు అంశాలపై వారిని ప్రశ్నించినట్టు తెలిసింది.
కవిత పిటిషన్పై రేపు విచారణ
ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఈ నెల 22న సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉన్నది. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణ జరుపనున్నది.