Gujarat riots | 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన పలు కేసుల్లో న్యాయస్థానాలు ఇటీవల వెలువరించిన పలు తీర్పులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి.
-స్పెషల్ టాస్క్ బ్యూరో
గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది నిందితులకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు ఇప్పటికే 17 ఏండ్లు కారాగార శిక్ష అనుభవించినందున బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది.
గోద్రా ఘటన అనంతరం గుజరాత్లోని నరోదాగావ్లో మైనార్టీ వర్గానికి చెందిన 11 మంది మరణానికి కారణమైన మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ గుజరాత్లోని ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. గుజరాత్ మాజీమంత్రి కోద్నానీ కూడా నిర్దోషుల జాబితాలో ఉన్నారు.
గోద్రా ఘటన తర్వాత చోటుచేసుకొన్న బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురి హత్య కేసులో శిక్షపడిన 11 మంది గత ఆగస్టులో విడుదలయ్యారు. గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్ పాలసీ కింద దాఖలు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు దోషుల్ని విడుదల చేసింది. అయితే, దోషుల విడుదలపై గత సోమవారం సుప్రీంకోర్టు సీరియస్ అయింది.
గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించడానికి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారన్న కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ను గత జూన్లో అరెస్టు చేశారు. అయితే, సెప్టెంబర్లో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
1990లో జరిగిన ఓ లాకప్ డెత్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ ప్రమేయం ఉన్నట్టు తేల్చిన జామ్నగర్ సెషన్స్ కోర్టు.. 2019లో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని సంజీవ్ 2011లో సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ సమర్పించారు.