హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే తదితర అంశాలపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. ఎస్సీ వర్గీకరణపై తమకు అందిన వినతులు, పంజాబ్, తమిళనాడు రాష్ర్టాల్లో వర్గీకరణ అమలవుతున్న తీరు, హర్యానాలో చేపట్టిన చర్యలను మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్రెడ్డి సీఎంకు వివరించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెకలను పరిగణనలోకి తీసుకొని, ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు నిర్దేశించారు. కమిషన్కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని సీఎస్కు సూచించారు. మంత్రివర్గ ఉప సంఘానికి అందిన వినతులపైనా సమావేశంలో చర్చించడంతోపాటు, వాటన్నింటినీ ఏకసభ్య కమిషన్కు అందించాలని నిర్ణయించారు.
క్షేత్రస్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదుల స్వీకరణకు ఉమ్మడి పది జిల్లాల్లో ఒకోరోజు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. సర్వేకు అవసరమైన యంత్రాం గం తమ వద్ద లేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలుపగా, రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బీసీ కమిషన్, ప్రణాళిక విభాగానికి సమన్వయకర్తగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీచేశారు. 60 రోజుల్లోనే సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేసి, డిసెంబర్ 9లోగా నివేదిక సమర్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొచ్చని సీఎం తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి, ముఖ్యమంత్రి కార్యదర్శులు మాణిక్రాజ్, షానవాజ్ ఖాసీం, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి పాల్గొన్నారు.