హైదరాబాద్, ఏప్రిల్ 13: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం జరిగింది. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టం విధివిధానాలను వివరించే జీవోను రేపు జారీ చేస్తామని తెలిపారు.
సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజ నరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, వన్-మ్యాన్ కమిషన్కు నాయకత్వం వహించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, లా సెక్రటరీ తిరుపతి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అమలు మార్గ దర్శకాలను కమిటీ క్షుణ్ణంగా సమీక్షించి, జీవో జారీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది.
షెడ్యూల్డ్ కులాలకు ప్రస్తుతం ఉన్న 15 శాతం రిజర్వేషన్లను హేతుబద్ధీకరించడం ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం లక్ష్యం. ఇందులో 59 ఎస్సీ ఉప కులాలను పరస్పర వెనుకబాటుతనం ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో అత్యంత వెనుకబడిన 15 వర్గాలు ఉన్నాయి. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ వర్గాలకు చెందిన వారు 3.288 శాతం ఉన్నారు. వారికి ఒక శాతం రిజర్వేషన్లను కేటాయించారు. మధ్యస్తంగా ప్రయోజనాలను పొందే 18 వర్గాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరు 62.74 శాతం ఉండగా.. 9 శాతం రిజర్వేషన్లను కేటాయించారు. సాపేక్షంగా మెరుగైన 26 వర్గాలకు గ్రూప్ 3లో చేర్చారు. వీరు ఎస్సీ జనాభాలో 33.963 శాతం ఉండగా.. 5 శాతం రిజర్వేషన్లు పొందనున్నారు.
కాగా, ఎస్సీ వర్గంలో క్రిమీలేయర్ను ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును కూడా కేబినెట్ సబ్ కమిటీ తిరస్కరించింది. ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఏ ఉప సమూహాన్ని మినహాయించకుండా సమాన ప్రయోజనాలను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఏ ప్రయోజనాలను నీరుగార్చబోమని, అన్ని ఎస్సీ వర్గాల హక్కులను కాపాడుతూ న్యాయాన్ని పెంపొందించడానికి వర్గీకరణ రూపొందించబడిందని ఆయన హామీ ఇచ్చారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని అన్నారు. తెలంగాణలో ఎస్సీ జనాభా దాదాపు 17.5% పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2026 జనాభా లెక్కల డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తుందని ఆయన అన్నారు.