హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): మౌలిక వసతులతో కూడిన కోర్టులు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు దోహదపడతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే దేశంలోని అనేక కోర్టుల్లో మౌలిక వసతులు లేవని, ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థలోని అవశేషాలు మిగిలి ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కోర్టు ఆవరణల్లో మహిళలకు కనీసం విడిగా మరుగుదొడ్లు కూడా ఉండటం లేదని చెప్పారు. ఇలాంటి సమస్యలన్నీ తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం ద్వారా పరిషారం కావాలని ఆకాంక్షించారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో వంద ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టు భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ పీవీ సంజయ్కుమార్, జస్టిస్ ఎస్వీ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్అరాధే పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ 32 జిల్లా కోర్టులకు ఈ-సేవా కేంద్రాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. జిల్లా కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లో సైతం మౌలిక వసతులు లేవని ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ ప్లానింగ్’ నివేదిక తెలిపిందని వివరించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో సామాజిక పరివర్తన దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇటీవల కాలంలో జిల్లా కోర్టుల్లో జడ్జీలుగా సగానికిపైగా మహిళలు పదవులను అధిష్ఠించడం శుభపరిణామమని చెప్పారు. తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయాన్ని అన్ని మౌలిక వసతులతో ఏర్పాటుచేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. న్యాయవాదులకు చాంబర్లు, వాద, ప్రతివాదులతో చర్చించుకునేందుకు కౌన్సెలింగ్ గదులు, ఇతర మహిళలకు విడిగా చాంబర్లు, జూనియర్ న్యాయవాదులకు వసతుల కల్పన వంటివి ఉండేలా చూడాలని సూచించారు. వాహనాల పారింగ్, పర్యావరణ పరిరక్షణ వంటివి ఉండాలని అభిలషించారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, పిల్లలకు పాలిచ్చే ప్రత్యేక గదులు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కోర్టు అనేది ప్రజా ప్రాంగణమని, ఇకడే ప్రజల ఆలోచనలు, విలువలు, హక్కులు, విధులు, బాధ్యతలు, న్యాయం వంటివి కేంద్రీకృతంగా న్యాయ ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇకడి హైకోర్టు నుంచి న్యాయమూర్తులుగా జస్టిస్ కోకా సుబ్బారావు రాజ్యాంగపరమైన దృష్టితో అనేక తీర్పులు వెలువరించారని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. జస్టిస్ చిన్నప్పరెడ్డి అత్యంత తెలివైన సోషల్విజన్తో దేశంలో ఎమర్జెన్సీ కాలంలో కీలక తీర్పులు చెప్పారని శ్లాఘించారు. జస్టిస్ జీవన్రెడ్డి మేధోమథనంతో అన్ని న్యాయకోణాలను విశ్లేషించిన మహనీయుడని కొనియాడారు. జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి వంటి మహనీయులు రాజ్యాంగపరమైన అనేక కీలక చారిత్రక తీర్పులను వెలువరించారని కీర్తించారు. రాజకీయాల నుంచి న్యాయవాద, ఇతర వృత్తుల్లోకి వచ్చిన యువత మార్పు కోరుతున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ హైకోర్టు భవానాల నిర్మాణం పర్యావరణహితం సాగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ సూచించారు. కోర్టుల్లో కన్సల్టేషన్ రూమ్లు, మీటింగ్ చాంబర్లు, మెడికల్క్లినిక్ లాంటివి ఉండాలని సూచించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. హైకోర్టు భవనాల నిర్మాణం కోసం అడిగిన వెంటనే భూమి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, ఏఏజీలు తేరా రజనీకాంత్రెడ్డి, ఇమ్రాన్ఖాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ చంద్రచూడ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్కు టీటీడీ ఆలయ అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆయన శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ, వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంరక్షిస్తూ డిజిటలైజ్ చేస్తున్న తాళపత్రాలను పరిశీలించారు.