హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల్లో అర్హత సాధించిన వారిలో దళితులే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా, బుధవారం ఎస్సీఈఆర్టీ ఫలితాలను వెల్లడించింది. ఇందులో టెట్ పేపర్ -1కు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 55,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 46,340 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 24,215 (52.26%) మంది అర్హత సాధించారు. పేపర్-1లో అత్యధికశాతం ఉత్తీర్ణత సాధించినది దళిత అభ్యర్థులే. జనరల్ క్యాటగిరీలో 15,718 దరఖాస్తులు రాగా, 2,254 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో కేవలం 14.34 శాతమే పాసయ్యారు. ఎస్టీ క్యాటగిరీలో 34,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 13,287 (38.21%) మంది టెట్కు అర్హత సాధించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన 1,26,751 మంది దరఖాస్తు చేయగా, వీరిలో 42,733 (33.71%) మంది అభ్యర్థులు టెట్కు అర్హత సాధించారు. మొత్తం మీద పేపర్1లో 36.89 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులు కాగా, అందులో అత్యధిక శాతం దళిత అభ్యర్థులే ఉన్నారు.
ఇక టెట్ పేపర్-2లోనూ దళిత అభ్యర్థులే అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. 42,309 మంది దరఖాస్తు చేయగా, 38,879 (28.24%) శాతం అర్హత సాధించారు. జనరల్ క్యాటగిరీలో 15,424 మంది పరీక్ష రాయగా, 536 (3.65%) మంది పాసయ్యారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి 22,435 దరఖాస్తులు రాగా, 4,144 (18.47%) మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. బీసీ క్యాటగిరీలో 1,13,309 మంది పరీక్ష రాయగా, 13,387 (11.81%) మంది అర్హత సాధించారు. మొత్తం మీద పేపర్-2లో కేవలం 15.30 శాతం మంది అభ్యర్థులే క్వాలిఫై కాగా, వీరిలోనూ దళిత అభ్యర్థులే అత్యధికంగా పాసయ్యారు.