హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ను పరిశీలించి తిరిగి సీడబ్ల్యూసీకి పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని అనుమతులు పొందింది. తొలుత రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయాలని భావించినా, వరద రోజులు 90 నుంచి 70 రోజులకు తగ్గుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు కేటాయించిన జలాలను తక్కువ సమయంలోనే ఎత్తిపోయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రోజుకు 2 టీఎంసీలతోపాటు అదనంగా మరో టీఎంసీని తరలించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఆ అదనపు టీఎంసీ తరలింపు పనులను కూడా కొత్త ప్రాజెక్టుగా పేర్కొంటూ కేంద్ర జలశక్తిశాఖ రివర్ బోర్డు గెజిట్ను జారీచేసింది.
అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనూ దీనిని చేర్చడంపై రాష్ట్ర సర్కారు అభ్యంతరం వ్యక్తంచేసింది. అదనపు టీఎంసీ పనులను గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రికి పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. రివైజ్డ్ డీపీఆర్ను సీడబ్ల్యూసీకి అందజేశారు. అయి తే, దానిని పరిశీలించి, నివేదిక అందజేయాలని జీఆర్ఎంబీకి సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు జారీచేసింది. కాగా, సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులను సాకుగా చూపుతూ డీపీఆర్ పరిశీలనను చేపట్టేందుకు జీఆర్ఎంబీ మొండికేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇటీవల స్టేటస్కో ఉత్తర్వులను ఎత్తివేసిం ది. తెలంగాణ విజ్ణప్తులను పరిశీలించాలని గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీలకు సుప్రీం మార్గదర్శకాలను జారీచేసింది. ఎట్టకేలకు జీఆర్ఎంబీ కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ పరిశీలన చేపట్టింది.