హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంగన్వాడీల రిక్రూట్ మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపింది అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అంగన్వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చిందన్నారు.
ప్రతిసంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.
కలెక్టర్లు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. అంగన్వాడీ రిక్రూట్ మెంట్ కు ఇచ్చిన కొత్త జీఓను మార్చాలన్నారు. మినీ అంగన్ వాడీలను కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అప్ గ్రేడ్ చేశాం. మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క మేము అప్ గ్రేడ్ చేసిన వాటిని మరోసారి మినీ అంగన్ వాడీలను అప్ గ్రేడ్ చేస్తూ తొలి సంతకం పెట్టారని ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు వారికి జీతాలు ఇవ్వడం లేదు. అంగన్ వాడీ వ్యవస్థను అవినీతి మయం చేశారని మండిపడ్డారు. అంగన్ వాడీ టీచర్లకు రూ.13,650 జీతం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పారదర్శకంగా అంగన్ వాడీ నియామకాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ వారి కార్యకర్తలకు దోచిపెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. దీంతో అర్హులు అంగన్ వాడీ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బస్సు యాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి ఆదివాసీలతో సుప్రీంకోర్టులో కేసు వేయించారు. లంబాడాలకు, ఆదివాసీలకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి లంబాడాలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమన్నారు.