హైదరాబాద్: నిర్మల్ జిల్లా బాసర గ్రామంలోని దస్తగిరి గుట్టపై 10వ శతాబ్ధంనాటి కల్యాణి చాళుక్యుల శాసనాన్ని తెలంగాణ బృందం గుర్తించింది. ఈ శాసనంలో కల్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడైన రెండో తైలపుని కుమారుడైన సత్యాశ్రయుని పేరు కనిపిస్తున్నది. రాజు నివాసాల నిర్మాణం చేయించినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది.
ఈ శాసనంలో రామస్వామి అని కూడా పేర్కొన్నట్లు, అతను అప్పట్లో ఒక న్యాయవాది కావచ్చునని శాసనం ద్వారా అర్థమవుతున్నదని కొత్త తెలంగాణ బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. శాసనం కింద చెక్కిన త్రిశూలంవల్ల శాసనం వేయించిన సట్టిగ శైవమతాన్ని ఆచరించేవాడని అర్థం చేసుకోవచ్చు. సత్యాశ్రయున్ని ఇరవబెడంగ, సట్టి, సట్టిగ అని కూడా పిలిచేవారని చెప్తారు. స్థానిక యువకుల సమాచారం మేరకు, తమ బృందానికి చెందిన సభ్యుడు బలగం రామ్మోహన్ ఈ శాసనాలను గుర్తించినట్లు హరగోపాల్ పేర్కొన్నారు.