హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జీ సతీశ్రెడ్డి ప్రశంసించారు. అన్ని రకాల కాలుష్య సమస్యలకు ఏకైక పరిష్కారం మొక్కలు నాటడమేనని, ఆ పనిని గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న సంతోష్కుమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. సంతోష్ హరితయజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం సంతోష్కుమార్తో కలిసి సతీశ్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. మనిషి తన అవసరాల కోసం సృష్టించిన ప్లాస్టిక్ యావత్ భూగోళాన్ని అల్లకల్లోలం చేస్తున్నదని, దానిని నుంచి మనిషి బయటపడటానికి లక్షల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే కాలుష్యం ప్రమాదకరమైందని అన్నారు. కాలుష్యం గాలికి, నీరుకు మాత్రమే సంబంధించినది కాదని, మన జీవిత ప్రయాణంలో ప్రతి అంశంలో కాలుష్యం ప్రభావం చూపుతుందని చెప్పారు.
అందుకే నేడు లక్షల బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ వేరే గ్రహాల్లో జీవన అవకాశాల కోసం పరిశోధిస్తున్నట్టు తెలిపారు. ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ శాస్త్ర సాంకేతికరంగంలో భారతదేశం గర్వించే స్థానానికి చేరుకోవడంలో తనదైన పాత్ర పోషించిన సతీశ్రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాలుపంచుకోవడం చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. వారి స్ఫూర్తివంతమైన మాటలు.. అనేక మందిని మొక్కలు నాటించే వైపుగా ఆలోచింపజేసేవిగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్స్ రాఘవ, కరుణాకర్రెడ్డి, ఇతర సైంటిస్టులు పాల్గొన్నారు.