గజ్వేల్/తొగుట, ఆగస్టు 22: మల్లన్నసాగర్ మహాద్భుతంగా ఉన్నదని మహారాష్ట్రకు చెందిన సర్పంచ్లు, రైతుల కితాబునిచ్చారు. మంగళవారం గజ్వేల్, తొగుటలో మహారాష్ట్రకు చెందిన వందమంది రైతులు, సర్పంచ్ల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో రోజుకు పదిమంది రైతులు కరువుకాటకాలతో మరణిస్తున్నారని అన్నారు. తెలంగాణ మొత్తాన్ని సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేసి రామరాజ్యాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. మహారాష్ట్రకు చెందిన సర్పంచ్ల బృందం సభ్యులు అక్షయ్ అనిల్పాటిల్, సైదీప్, దిలీప్కుమార్, అహ్మద్, పవన్నాయక్, మధుతోపాటు దాదాపు వందమందికిపైగా మల్లన్నసాగర్ పంప్హౌస్, కట్టను పరిశీలించారు. పంప్హౌస్లో మ్యాప్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను ఇంజినీర్లు వారికి వివరించారు.
గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్, కోమటిబండ మిషన్ భగీరథ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అన్నారు. తెలంగాణలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి మహారాష్ట్రలో కావాలని, అందుకు దేశమంతట కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూస్తే తమకు ఎంతో సంతోషంగా ఉన్నదని, వందల మైళ్ల దూరం నుంచి గోదావరి నీళ్లను తీసుకొచ్చి మంచినీళ్లుగా ప్రజలకు అందించడం, నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకులు, ఇంటింటికి ప్రభుత్వమే నల్లాలు పెట్టడం బాగున్నదని కితాబిచ్చారు.