Telangana | తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 22: గ్రామ పంచాయతీలను అప్పులు తెచ్చి అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని, తక్షణమే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. బిల్లులు విడుదల చేయకుంటే లోక్సభ ఎన్నికల్లో ఒక్కో సీటు నుంచి వంద మంది పోటీ చేస్తామని హెచ్చరించింది. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ల సంఘం గురువారం హైదరాబాద్లో ఆందోళనకు దిగింది.
నల్లజెండాలు, మెడలో నల్ల కండువాలు ధరించిన సర్పంచ్లు పబ్లిక్గార్డెన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గన్పార్కులోని అమరవీరుల స్థూపానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఆ తరువాత అసెంబ్లీ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు తదితర పనుల కోసం అప్పులు తెచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు.
చేసిన పనులకు ప్రభుత్వం నుండి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఇటీవల కొందరు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని.. అయినప్పటికీ పాలకులు నిధుల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రూ.1200 కోట్ల వరకు రావాల్సి ఉన్నదని చెప్పారు.
సర్పంచ్ల కాలపరిమితి అయిపోవడంతో స్పెషల్ ఆఫీసర్లకు అధికారాన్ని కట్టబెట్టిన ప్రభుత్వం.. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా మౌనం దాల్చడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసినందుకు మిత్తీలు కట్టాలా అని ప్రశ్నించారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామాలలో పాదయాత్రలు చేసిన కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్కకు పెండింగ్ బిల్లుల గురించి నివేదించామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు నేడు మంత్రి పదవుల్లో ఉంటూ తమను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సర్పంచ్ల బిల్లులపై అనేక మార్లు ఆరోపణలు, విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బిల్లుల గురించి మాట్లాడటం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లో సైతం పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేకపోవడం శోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇప్పటివరకు రెండుసార్లు వినతి పత్రం సమర్పించామని, అయినా కూడా స్పందన లేదని చెప్పారు.
ఇదే ధోరణి కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో వందమంది సర్పంచ్లు పోటీలో నిలుస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళనలో సర్పంచ్ల సంఘం నాయకులు కొలను శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కే విజయ్రెడ్డి, ఒగ్గు గణేశ్, మునగాల ప్రభాకర్రెడ్డి, కేశబోయిన మల్లయ్య, కుంభం కరుణాకర్, మామిడి వెంకన్న, కాచం శ్రీనివాసరెడ్డి, లావుడ్య వెంకన్న, సల్ల నారాయణ, బాలు నాయక్, ఎల్లాచారి, మల్లారెడ్డి పాల్గొన్నారు.