ములుగు, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల పండుగలో తొలిరోజు బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7.14 గంటలకు గుడి నుంచి మొంటె(వెదురుబుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నుంచి సమ్మక గుడికి చేరుకున్నారు. అప్పటికే అకడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులుతో కలిసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి 10.48 గంటలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటుకుంటూ వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం మార్మోగింది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ నేరుగా గద్దెలపైకి వెళ్లకుండా మేడారంలోని సమ్మక్క పూజా మందిరానికి చేరుకున్నది. అప్పటికే గోవిందరాజు, పగిడిద్దరాజు అక్కడికి చేరుకొన్నారు. పూజారులందరూ సంయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కట్టువేసిన అనంతరం అందరూ కలిసి సారలమ్మ గద్దెపైకి చేరుకొని తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు.
కాక సారయ్య ఆధ్వర్యంలోని పూజారుల బృందం సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్వాగతం పలికారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరింది. ప్రభుత్వం తరఫున జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలోని అధికారుల బృందం అంతకుముందు కన్నెపల్లికి చేరుకుని అకడ వడ్డెలు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ పర్యవేక్షణలో రోప్పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ బృందం తాడు వలయంగా ఏర్పడి వీరికి భద్రత కల్పించారు.
సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు జనంతో నిండిపోయింది. సారలమ్మ గద్దెపైకి రాగానే భక్తులు పరవశంతో ఊగిపోయారు. దర్శనం కోసం ఒకసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఒకేసారి ఎకువమంది రావడంతో తోపులాట జరిగింది. మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై కూడా బారులు తీరారు. భక్తుల తాకిడి పెరగడంతో దర్శనానికి ఎకువ సమయం పడుతున్నది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో మేడారం జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ ఎం మహేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 9 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించామని, భక్తుల రద్దీని అంచనావేసి తగినచర్యలు తీసుకునేలా మేడారంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామని డీజీపీ పేర్కొన్నారు.
జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక మేడారం గద్దెలపైకి చేరడం. చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక ప్రతిమను తీసుకొచ్చే ప్రక్రియ గురువారం జరుగుతుంది. సాయంత్రం గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి కొకెర కృష్ణయ్య చిలుకలగుట్టపై నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మకను వెదురు కంకబొంగులో భద్రపర్చుకుని తీసుకొస్తారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం తుపాకులతో కాల్పులు జరిపిన తర్వాత సమ్మక ప్రతిమతో వడ్డెలు బయల్దేరుతారు. ఆ సమయంలో భక్తులు… సమ్మకకు ఎదురేగి కోళ్లను, మేకలను బలి ఇస్తారు. రాత్రి సమ్మకను గద్దెపై ప్రతిష్ఠించాక భక్తులు మొకులు చెల్లించుకుంటారు. వనదేవతలందరూ కొలువై ఉండడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు పెద్దసంఖ్యలో భక్తులు మొకులు చెల్లించుకుంటారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు 18న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లనున్నారు. అక్కడ మొక్కులు తీర్చుకొని మేడారం అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత సీఎం వరుసగా 23వ తేదీ వరకు పర్యటనలు చేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ చేపట్టిన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా ఫోన్ చేసి ముంబైకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ నెల 20న మహారాష్ట్ర సీఎంతో భేటీ కావడానికి సీఎం కేసీఆర్ ముంబై వెళ్తున్నారు. అదేరోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్కు వస్తారు. తిరిగి ఈనెల 21న నారాయణఖేడ్లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. సిద్దిపేట జిల్లాలో నిర్మితమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ 23న ప్రారంభిస్తారు.