సంగారెడ్డిలో ఆటో కోసం వేచిచూస్తున్న సంతోష్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగివ్వాలని అడిగినకొద్దీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది దగ్గర్లోని బంక్ నుంచి పెట్రోల్ తెచ్చుకుని, ఒంటిపై పోసుకున్నాడు. నడిబజారులో అగ్నికీలల్లో కాలిపోతుంటే.. స్థానికులు మంటలార్పి దవాఖానకు తరలించారు.
Sangareddy | సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అది సంగారెడ్డి చౌరస్తా.. గురువారం సాయంత్రం.. సిద్దిపేటలో విధులు ముగించుకొని బస్సులో వచ్చిన సంతోష్ (45) అక్కడ దిగి ఆటో కోసం చూస్తున్నాడు.. అదే సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఫొటోలు తీస్తున్నారు.. దీన్ని గమనించిన సంతోష్ ట్రాఫిక్ పోలీసుల చర్యలను తన ఫోన్లో చిత్రీకరించాడు.. దీంతో పోలీసులు అతడి ఫోన్ లాక్కొని బెదిరించారు. ఫోన్ తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెంది.. వారి ముందే పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి ఒంటిపై పోసుకొని, నిప్పంటించుకున్నాడు. 50 శాతం కాలిన గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
సంగారెడ్డి నివాసి అయిన బాధితుడు.. పోలీసులు తన ఫోన్ లాక్కొని ఇబ్బంది పెట్టారని అందుకే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డానని తెలిపాడు. 50 శాతానికిపైగా చర్మం కాలిపోవటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. బాధితుడు సిద్దిపేటలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా, ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని సంగారెడ్డి డీఎస్పీ రమేశ్కుమార్ తెలిపారు. అతడే పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని, నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు తీశాడని వెల్లడించారు. అతడి నుంచి ఫోన్ తీసుకొని వీడియోలు పరిశీలిస్తుండగా, మద్యం మత్తులో పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేశాడని వివరించారు. ఆ తర్వాత పెట్రోల్తో నిప్పంటించుకున్నాడని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.