లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఎటా సఫారీ పార్క్లో రెండు సింహాలకు కరోనా సోకింది. నాలుగేళ్ల గౌరీ, తొమ్మిదేళ్ల జెన్నీఫర్ నమూనాలను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కు పంపామని, ఫలితాల్లో పాజిటివ్గా వచ్చినట్లు డైరెక్టర్ కేకే సింగ్ తెలిపారు. సింహాల్లో ఆకలి తగ్గడం, జ్వరం లక్షణాలు కనిపించాయని.. దీంతో రక్తం, మలం నమూనాలను ఈ వారం ప్రారంభంలో పరీక్షల కోసం పంపినట్లు పేర్కొన్నారు. మిగతా సింహాలకు వైరస్ సోకుండా వాటిని ప్రత్యేక ప్రాంతానికి తరలించి, వైద్య చికిత్సలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటి పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. అలాగే మరో 14 సింహాల నమూనాలను ఐవీఆర్ఐకు పంపారు.
అయితే, సంతానోత్పత్తి కేంద్రంలో సింహాలకు వైరస్ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ పార్క్ కార్మికుడికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ క్రమంలో జంతువుల భద్రతను పెంచారు. పార్క్లోని ఉద్యోగులందరూ పీపీఈ కిట్లు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిబ్బంది నమూనాలను ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం తరలించారు. సింహాలకు వైరస్ పాజిటివ్గా తేలిన క్రమంలో పార్క్లో సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్ జూపార్క్లోనూ ఎనిమిది సింహాలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.