హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): పిల్లల్ని పెంచిన చేతులు మొకల్ని పెంచితే, ప్రకృతి పరవశించిపోతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని, అంతే ప్రేమతో మహిళా లోకం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొకలు నాటి, సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం ప్రగతి భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రత్యేక కార్యక్రమ పోస్టర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తో కలిసి ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పాల్గొనేలా తనవంతు కృషి చేస్తానని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని మొకలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు. మహిళా ఉద్యోగులంతా విరివిగా మొకలు నాటాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే పుడమి బాగు కోసం అలుపెరగకుండా కృషి చేస్తున్నారని స్మితా సబర్వాల్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం తర్వాతి తరాల బాగు కోసం తలపెట్టిన నిస్వార్థ కార్యక్రమమని ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు.