శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగము.. అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహోత్సవ వేడుకలు బుధవారం శాస్ర్తోకంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి లవన్న బుధవారం ఉదయం సాంప్రదాయబద్దంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో ఆలయ ముఖద్వారం నుండి ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి, గణపతిపూజ మండపారాధన తదితర పూజాకార్యక్రమాలు జరిగాయి. లోక కళ్యాణం కోసం మకర సంక్రమణ పుణ్యకాలంలో ఏడు రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో ఉత్సవాల్లో అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికలు శివసంకల్పాన్ని పఠించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని తొలుతగా గణపతిపూజ, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణ ధారణ, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం ప్రధాన కళశస్థాపన కార్యక్రమాలు జరిపించారు.
సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనమైన నందీశ్వరుని ప్రతిమ, అష్టమంగళాలను చిత్రించిన నంది ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై పతాకావిష్కరణగా నూలు తాడుతో పైకి ఎగురవేసేందుకు సిధ్దంచేసి ఉరేగింపు నిర్వహించి చండీశ్వరస్వామి సమక్షంలో ప్రత్యేక పూజాధికాలు చేశారు. అనంతరం భేరిపూజ చేసి మేళతాళాల రాగాలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితి అని ప్రధాన అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చే యక్ష గంధర్వ గణాలకు ఆలయ ప్రాంగణంలో నిర్ణీత స్థలాలు కేటాయించి నిత్యోత్సవ పూజలు జరిపించుతారని అర్చక పండితులు తెలిపారు.