శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమంగళాలను తోలగించి భోగభాగ్యలను అందించే భోగి మంటలతో సాంప్రదాయ ఘట్టంతో శుక్రవారం తెల్లవారుజాము నుండి మూడవరోజు ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. అదేవిధంగా పండుగ రోజున క్షేత్రానికి వచ్చే భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు సాయంత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అక్కమహాదేవి మండపంలో వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన అనంతరం డప్పు చప్పుళ్లు మేళతాళాలు కళాకారుల సాంప్రదాయ నృత్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. రావణవాహనంపై విహరించిన స్వామిఅమ్మవార్లను విక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు.
చెంచులలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి రోజున జరగాల్సిన స్వామి అమ్మవార్ల దోంగపెళ్లిని దేవస్థానం ఘనంగా చేయిస్తుందని ఈఓ లవన్న తెలిపారు. చెంచుల ఆడపిల్లగా భావించే భ్రమరాంబ అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చిన మల్లికార్జునుడికి అమ్మవారితో ప్రేమ బంధం ఏర్పడి వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయమై అంగీకరించని పెద్దలను కాదని అమ్మవారిని అపహరించుకుపోయి మకర సంక్రాంతి రోజు దొంగ పెళ్లి చేసుకున్నాడని విశ్వసిస్తూ అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. శనివారం రాత్రి జరిగే పార్వతీ కళ్యాణానికి ప్రత్యేక ఆహ్వానంతో క్షేత్ర పరిసరాల్లో ఉండే 150 చెంచు గూడెంల నుండి గిరిపుత్రులు పాల్గొంటారని తెలిపారు.