మహబూబ్నగర్ : గడచిన రెండు వారాలుగా రైతుబంధు సంబురాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మంత్రి మహబూబ్నగర్ గ్రామీణ మండలం కోడూరు నుంచి మన్యం కొండ స్టేజ్ వరకు రైతుబంధు సంబురాల సందర్భంగా నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం కోడూరు రైతు వేదికలో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు నీతి తప్పడని, అలాంటి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గతంలో రైతులు సాగునీటికి, విద్యుత్కు, విత్తనాలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ తో పాటు, సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా, ఇచ్చి రైతును రాజును చేయాలన్న కలలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలు చేస్తున్నామని, పేదల ఆర్థిక పరిస్థితులు మారిపోయాయని వివరించారు. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ ను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దుతామని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.
రైతు బంధు పథకం కింద ఒక్క మహబూబ్ నగర్ నియోజకవర్గానికె 200 కోట్ల రూపాయలను, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1460 కోట్ల రూపాయలను ఇచ్చామని ఆయన తెలిపారు.
అనంతరం మంత్రి రైతుబంధు సంబురాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్, రైతు బంధు డైరెక్టర్ మల్లు నరసింహా రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డిఓ పద్మశ్రీ, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, ఎంపిపి సుధాశ్రీ, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, రైతుబంధు మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.