హైదరాబాద్, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవోల గురించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నేతలు, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు స్వామిగౌడ్, దేవీప్రసాద్ డిమాండ్చేశారు. ఉద్యోగులను కొనేశక్తి ఎవ్వరికీ లేదని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమంలో రాజీలేని పోరాటం చేసిన టీఎన్జీవోల గురించి మాట్లాడిన సంజయ్ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని దేవీప్రసాద్ ప్రశ్నించారు. సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై దాడిగా భావిస్తున్నామన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో స్వామిగౌడ్తో కలిసి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగులకు వీరోచిత పోరాట చరిత్ర ఉన్నదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఏ పార్టీ ముందుకు వచ్చినా కలిసి పనిచేశామని చెప్పారు. కానిస్టేబుళ్లు బీజేపీకి ఓటు వేస్తామని చెప్తే ఒప్పుకొన్న సంజయ్.. ఉద్యోగులు టీఆర్ఎస్కు ఓట్లు వేస్తామంటే ఎందుకు తప్పు పడుతున్నారని నిలదీశారు. మోదీ ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఆయనను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, తెస్తున్నామని, పీఆర్సీలో 43 శాతం, 30 శాతం అమలు చేయించామని గుర్తుచేశారు.
ఉద్యోగులపై బీజేపీ నాయకుల ఆరోపణలు సరికాదని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. తాము అమ్ముడు పోయిఉంటే ఆ నాడు ఉద్యమంలో ఉండే వాళ్లంకాదని చెప్పారు. ఆ నాడు తమను చంపడానికి ప్రయత్నం జరిగిందని, బీజేపీ నేతలు అప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. సమ్మె చేస్తే దసరా సమయంలో జీతాలు లేక.. పిల్లలకు కొత్త బట్టలు కొనలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నప్పుడు వీరు ఎకడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యోగులపై దాడులు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. కిషన్రెడ్డి పోరుయాత్ర చేస్తే ఉద్యోగులు ప్రతి జిల్లాలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ మాజీ చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ.. ఉద్యోగులకు, సీఎం కేసీఆర్కు మధ్య పేగు బంధం ఉన్నదన్నారు. ఉద్యమ నాయకుడే సీఎం అయ్యారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. హమీద్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో తాను పనిచేసినప్పుడు 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేశామని, ఏనాడూ బండి సంజయ్ ఉద్యోగులకు సంఘీభావం తెలపలేదని గుర్తుచేశారు.