వరంగల్ : గ్రేటర్ వరంగల్(Greater Warangal) కార్పొరేషన్లో అవలంబిస్తున్న పారిశుధ్య విధానాలు బాగున్నాయని నేపాల్(Nepal), బంగ్లాదేశ్(Bangladesh)కు చెందిన నగర మేయర్లు(Mayors) ప్రశంసించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో పారిశుధ్యంపై అధ్యయనం చేసేందుకు వచ్చిన మేయర్ల బృందం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, పబ్లిక్ టాయ్లెట్ల(Public Toilets) నిర్వహణను పరిశీలించింది.
అమ్మవారిపేటలో ఉన్న మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం, మైసయ్య నగర్ మురికివాడ, చిట్టి పార్క్, వ్యక్తిగత మరుగుదొడ్లు, వడ్డేపల్లిలోని పబ్లిక్ టాయ్లెట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను పారిశుధ్య వ్యవస్థ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మేయర్లు మాట్లాడుతూ వరంగల్ కార్పొరేషన్లో పారిశుధ్య వ్యవస్థ బాగుందని అన్నారు. పబ్లిక్ టాయ్లెట్ల నిర్వహణ సమర్థవంతంగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవలంబించిన పద్ధతులు బాగున్నాయని అన్నారు. ఇక్కడి పద్ధతులను తమ నగరాల్లో అమలు చేస్తామని అన్నారు.
పారిశుధ్యంలో అమలు చేస్తున్న విధానాలను విదేశీ మేయర్లకు ఆస్కీ ప్రతినిధులు రాజ్మోహన్, ఓం ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో నేపాల్లోని లలిత్పూర్(Lalitpoor) మున్సిపాలిటీ మేయర్ రాజు మహాజన్, గోదావరి మున్సిపాలిటీ(Godavari Muncipality) మేయర్ గజేంద్ర మహజన్, లహన్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ రాంచలితర్ మహతో, బంగ్లాదేశ్ మున్సిపల్ చైర్మన్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దివాన్ కమల్అహ్మద్, నేపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ జాయింట్ సెక్రెటరీ కమల్ సఫ్కోట, ఫెడరల్ వాటర్ సప్లైఅండ్ సీవరేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ చీఫ్ దేవంద్ర కుమార్ ఝూ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.