సంగారెడ్డి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత ఇలాకా సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభ అట్టర్ప్లాఫ్ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాక్రే సహా కాంగ్రెస్ ఉద్ధండులు హాజరైనప్పటికీ జనం లేక సభ తుస్సుమన్నది. సంగారెడ్డిలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న గంజ్ మైదాన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. సభకు ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖర్గేతోపాటు రేవంత్రెడ్డి, మాణిక్యం ఠాక్రే, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, వీ హన్మంతరావు, బోసురాజు హాజరయ్యారు. బహిరంగ సభలో దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి ప్రసంగిస్తూ..కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి వివరించగా, జనం నుంచి స్పందన కనిపించలేదు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మినహా ప్రజలెవరూ చప్పట్లు కొట్టకపోవడంతో నాయకులందరూ తెల్ల ముఖాలు వేశారు. ఖర్గే ప్రసంగం ప్రారంభం కాగానే జనం ఒక్కక్కొరుగా సభాస్థలం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో బహిరంగసభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల గురించి ఖర్గే వివరించే ప్రయత్నం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. తన ప్రసంగం కొనసాగుతుండగానే జనం వెళ్లిపోతుండటంతో ఖర్గే అసంతృప్తికి లోనయ్యారు. జగ్గారెడ్డి లేచి అందరూ కూర్చోవాలని కోరినా ఎవరూ వినలేదు. జనం సభ నుంచి వెళ్లిపోవటాన్ని చూసిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం అసంతృప్తికి గురయ్యారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంతకుముందు ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు స్వాగతం పలికేందుకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఎదుట వాహనంలో బైఠాయించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దవాఖాన ఎదుట గుమిగూడారు. దీంతో ప్రభుత్వ దవాఖానలోకి వెళ్లే వైద్యులు, రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.