Sangareddy | సంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలనలో వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాకు నిధుల వరద పారుతున్నది. ఫలితంగా అభివృద్ధి పరుగులు పెడుతున్నది. హైదరాబాద్కు సమీపంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంతో పాటు మారుమూల ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. ఇటీవలే జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ రూ.250 కోట్ల నిధులు విడుదల చేశారు. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో జిల్లాకు గోదావరి జలాలు తీసుకొస్తున్నారు. ఇందుకోసం రూ.4,427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూసిన మెడికల్ కాలేజీ కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. అదనంగా జిల్లాకు నర్సింగ్ కాలేజీని మంజూరు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. దీనిలో భాగంగా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 145 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం దీనిని నిర్మించింది. 117 బ్లాక్లతో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను, రూ.1,432 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇవే కాకుండా జిల్లాకు రూ.338.11 కోట్లతో 5,920 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ.210 కోట్లతో 3,498 ఇండ్లు పూర్తయ్యాయి. రూ.42 కోట్లతో 22 గోదాములు నిర్మించగా, మార్కెట్యార్డుల అభివృద్ధికి రూ.25.78 కోట్లు విడుదల చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సంగారెడ్డి జిల్లాలో 2,572 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. ఇందులో 88 మెగా పరిశ్రమలు రూ.13,305 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. రూ.6,323 కోట్ల పెట్టుబడులతో 157 భారీ పరిశ్రమలు, రూ.3,938 కోట్ల పెట్టుబడులతో 177 మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.4,065 కోట్లతో 1,085 చిన్న పరిశ్రమలు, రూ.548 కోట్ల పెట్టుబడులతో 1,065 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమల ద్వారా 1,88,191 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. జహీరాబాద్లో నిమ్జ్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి దొరుకుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డిలో 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇటీవలే మంత్రి హరీశ్రావు సంగారెడ్డిలో రూ.50 కోట్లతో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డిలో 350 పడకల దవాఖాన, మాతాశిశు సంక్షేమ దవాఖాన, టీ-డయాగ్నాస్టిక్ హబ్ అందుబాటులోకి వచ్చాయి. సంగారెడ్డిలో రూ.37 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్లో టిఫ్పా స్కాన్ సేవలు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి గురువారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సదాశివపేట, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్లో 100 పడకల దవాఖానలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నారాయణఖేడ్, జోగిపేట దవాఖానల్లో డయాలసిస్ సేవలను ప్రారంభించింది. ఇవిగాక 19 బస్తీ దవాఖానలు, 173 పల్లె దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.