భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు చకచకా సాగుతున్నాయి. ఆయా పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ అధికారులు సిద్ధం చేశారు. సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సంగమేశ్వర పథకానికి ప్రణాళికలు రెడీ చేశారు.
ఈ పథకం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఆ ప్రాజెక్టు పనులకు రూ.2,653 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా, టెండర్లను కూడా ఖరారు చేశారు. ఈ పథకం నిర్మాణ పనులకు మొత్తంగా 6,800 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించి, ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. సింగూరు జలాశయం ఎడమవైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు రూపొందించారు.