హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): సీఎం కప్ టోర్నీ క్రీడల నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను సాంస్కృతిక, క్రీడా, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సోమవారం సచివాలయంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. దాదాపు 8500 మందికి పైగా క్రీడాకారులు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నీకి హాజరు కానున్నందున ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా అన్ని స్టేడియాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ క్రీడ ఏ స్టేడియంలో నిర్వహించేది.. స్టేడియం వారీగా వసతి సౌకర్యంపై వెంటనే షెడ్యూల్ సిద్ధం చేసి మంగళవారం లోగా సమర్పించాలని సాట్స్ అధికారులకు సూచించారు. భోజన వసతి సౌకర్యంతో పాటు క్రీడల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తరాదని ఆయన ఆదేశించారు. తాగు నీరు, పారిశుధ్య పనుల విషయంలో జీహెచ్ఎంసీకి వెంటనే లేఖ రాయాలని అధికారులకు ఆయన సూచించారు. రాత్రి వేళలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించాలని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణను కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీ క్రీడలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మండల స్థాయిలో తొలుత క్రీడా పోటీలు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పోటీపడతారు. మండల స్థాయి క్రీడాపోటీలను ఈ నెల 15 నుంచి 17 వరకు, ఇకడ గెలిచిన క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 24 వరకు జిల్లాస్థాయిలోనూ, జిల్లా స్థాయి విజేతలు ఈ నెల 29 నుంచి 31 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. క్రీడల నిర్వహణకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, రూ.3.60 కోట్ల నిధులు కేటాయించారు. విజేతలకు సీఎం కప్తో పాటు నగదు పారితోషికాలు అందిస్తారు. స్టేడియం వారీగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై విద్యుత్తు శాఖ, సింగరేణి ఉన్నతాధికారులు సోమవారం సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి నుంచి హెడ్క్వార్టర్ వరకు వివిధ దశల్లో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రం ఏర్పడిప్పుడు విద్యుత్తు రంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? అనే విషయాలపై పూర్తి సమాచారంతో డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేయాలని సమావేశంలో సూచించారు. సింగరేణి సాధించిన ఘన విజయాలను తెలుపుతూ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నేతృత్వంలో సమావేశం జరుగగా, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, జేఎండీ శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్ బలరామ్, ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.