బోధన్, ఏప్రిల్ 26: నిజామాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం మంజీరా నదిలో ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తున్న ఇసుక క్వారీల్లో నిబంధనలను బేఖాతర్ చేస్తూ విచ్చలవిడిగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా తీరుపై ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ఆదివారం ప్రత్యేక కథనం ప్రచురితంకాగా అధికార యంత్రాంగంలో కలవరం సృష్టించింది. “మంజీర’ను తోడేస్తున్నరు!’ శీర్షికతో ప్రచురితమైన ఈ కథనం జిల్లాలో చర్చనీయాంశమైంది.
పొతంగల్ క్వారీల్లో ఇసుక అక్రమ దందా జరుగుతున్న వైనాన్ని ఈ కథనం బహిర్గతం చేసింది. ఇసుక తవ్వకాలు, రవాణాలో నిబంధనలు బేఖాతరు అవుతున్న తీరు, సాగునీరు, తాగునీటికి, పర్యావరణానికి విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాల ఏర్పడుతున్న ప్రమాదంపై ఈ కథనం వివరించింది.
ఈ కథనం ఫలితంగా ఆదివారం పొతంగల్ మండలంలోని నాలుగు ఇసుక క్వారీలకు వచ్చే వాహనాల సంఖ్య సగానికి పైగా తగ్గాయి. ప్రతి రోజూ ఇసుకను అక్రమంగా రవాణా చేసే వాహనాలు, ఇసుక స్మగ్లర్లు అప్రమత్తమయ్యారు. అధికారులు కూడా సంకేతాలు ఇవ్వడంతో అక్రమంగా నడిచే వాహనాల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం.
కొన్ని రోజులుగా నడుస్తున్న వాహనాల సంఖ్య సగానికి పైగా తగ్గిపోవడం చూస్తుంటే.. నెలా, రెండు నెలలుగా ఏ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరిగిందో అర్థమవుతున్నది. అక్రమ ఇసుక వాహనాల తగ్గింపు తాత్కాలికమేనా.. లేదా భవిష్యత్తులో మళ్లీ భారీగా ఇసుక అక్రమ రవాణాకు తలుపులు బార్లా తెరుస్తారా అన్న విషయమై వేచి చూడాల్సిందే..!