వర్ధన్నపేట, ఫిబ్రవరి 21 : అక్రమార్కులకు ఆకేరువాగు ఇసుక.. కాసుల పంటను కురిపిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా యథేచ్ఛగా నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో వరంగల్ నగరానికి ఇసుక రవాణా జరుగుతూనే ఉన్నది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలుతున్నది.
ఇసుక తీయవద్దని గతంలోనే ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తెచ్చినా అక్రమార్కులకు అవేమీ పట్టడం లేదు. పచ్చని పంట పొలాలు, తోటలను ధ్వంసం చేస్తూ వాగు పరీవాహక ప్రాంతంలోని పంట భూముల్లో ఇసుకను తీసి తరలిస్తున్నారు. ఈ దందా దర్జాగా సాగుతున్నా పాలకులు, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.