మహదేవపూర్, మార్చి 12 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సరస్వతీ బరాజ్ సమీపంలో ఇసుక క్వారీ తవ్వకాలు ఆందోళనకు రేకెత్తిస్తున్నది. ముఖ్యంగా బరాజ్ డౌన్ స్ట్రీమ్ ప్రాంతంలో భారీ యంత్రాలతో చేపడుతున్న లోతైన తవ్వకాల వల్ల బరాజ్ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నదని ప్రజలు భయపడుతున్నారు. బరాజ్కు సమీపంలోనే భారీ ఎక్సకవేటర్లతో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నది అడుగుభాగంలో సుమారు 8 నుంచి 12 అడుగుల వరకు లోతుగా గోతులు తవ్వుతున్నారని స్థానికులు చెప్తున్నారు. దీనివల్ల నీటి సహజ ప్రవాహ మార్గం మారిపోవడం, ప్రవాహ వేగం పెరుగడం, ఫౌండేషన్ వద్ద నేల కొట్టుకుపోవడం (సవర్ ప్రభావం) వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నదని వారు పేరొంటున్నారు.
వర్షాకాలంలో గోదావరి ప్రవాహం పెరిగే సమయంలో నీటి ఒత్తిడి మరింత ఎకువగా ఉంటుంది. అలాంటి సమయంలో నది అడుగు భాగం బలహీనపడితే బరాజ్ నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉన్నది. ఒకసారి ఫౌండేషన్ చుట్టూ నేల కదలికలు ప్రారంభమైతే, అది క్రమంగా నిర్మాణ స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇసుక క్వారీ త్వవకాల్లో కాంట్రాక్టర్లు నిబంధనలు పాటిస్తున్నారా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మైనింగ్ నిబంధనల ప్రకారం.. బరాజ్లు, ఆనకట్టలు, వంతెనలకు నిర్దిష్ట దూరం వరకు ఇసుక తవ్వకాలు పూర్తిగా నిషేధం. తవ్వకాలకు ముందు పర్యావరణ అనుమతి, మైనింగ్ అనుమతి, జియాలజీ సర్వే నివేదికలు తప్పనిసరి. అయితే అన్నారం వద్ద జరుగుతున్న తవ్వకాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా అన్న విషయమై స్పష్టత లేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నది.
అన్నారం డౌన్ స్టీమ్ ఇసుక క్వారీ నిర్వహణపై మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తక్షణమే సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగితే వెంటనే నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన సరస్వతీ బరాజ్ రక్షణలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
బరాజ్ పరిధిలోని సాగు భూములకు ఈ నిర్మాణం కీలకం. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతే లేదా నిర్మాణానికి నష్టం కలిగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నారంతోపాటు మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలతో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందోనని దిగులు చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో పొలాలకు సరిపడా సాగు నీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.