హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హరితహారంలో జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెచ్ఎండీఏ, సీహెచ్ఎంసీ, ఉద్యానశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ అని, 33శాతం పచ్చదనం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. తమ ఇంటి ఆవరణలో చెట్లు పెంచుతున్న వారికి కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. చింత, సీతాఫల్, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొకల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, సుభద్ర, కమిషనర్ హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై దుండగులు ట్రాక్టర్ ఎక్కించి హత్యకు యత్నించిన ఘటనపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం సహించబోదని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని సురేఖ పేర్కొన్నారు.