భారీగా హాజరైన భక్తులు, పలువురు ప్రముఖులు
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 19: శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రంలో నిర్మించిన 108 ఆలయాల్లో (దివ్యదేశాలు) కల్యాణోత్సవ వేడుకలను త్రిదండి చినజీయర్స్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. తొలిసారిగా 108 దివ్యదేశాలకు కల్యాణోత్సవం నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. భక్తులకు ప్రపంచంలోని 8వ వింతగా శ్రీరామనగర్ సమతామూర్తి క్షేత్రం వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. సమతామూర్తి సహస్రాబ్ధి ఉత్సవాల నిర్వహణలో సహకరించిన వారికి ఆయన మంగళాశాసనాలను అందజేశారు. కల్యాణోత్సవంలో అహోబిల జీయర్స్వామి, దేవనాథ జీయర్స్వామి, మైహోంగ్రూపు సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు, ఎండీ జూపల్లి జగపతిరావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.