హైదరాబాద్, జనవరి 13 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో రూ.1,000 కోట్లతో నిర్మించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని (భగవద్రామానుజ పంచలోహ విగ్రహం) ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న రామానుజాచార్య బంగారుమూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. ఆయా కార్యక్రమాలకు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ హాజరుకానున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించనున్న భగవద్రామానుజ సహస్రాబ్ది వేడుకల షెడ్యూల్ను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, వివిధ రాష్ర్టాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మహాకార్యాన్ని ఐదు వేల మంది రుత్వికులతో నిర్వహించనున్నారు. మొత్తం 1,035 హోమగుండాలను ఏర్పాటు చేయనున్నారు. హోమంలో రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని వినియోగించనున్నారు.
సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం విశిష్ఠతలు