హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఒక మొక్క ఒక మనిషికి సరిపడా ఆక్సిజన్ను అందిస్తుందని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్కు వచ్చిన సల్మాన్.. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్కుమార్తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమని అన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే చెట్లు నాటడం ఒక్కటే మార్గమని, ఆ పనికి ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా బాటలు వేశారని కొనియాడారు. ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్తు తరాలను కాపాడుకోవచ్చని అన్నారు. అభిమానులంతా గ్రీన్ చాలెంజ్లో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. పెద్ద మనసుతో గ్రీన్ చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటిన సల్మాన్ఖాన్కు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ మొక్కలు నాటడం కోట్లాది మంది ఆయన అభిమానులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సినిమా బృందం, గ్రీన్ చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపు కోసం పనిచేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచు ఖండం అంటారిటికాపై గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా, కర్బన ఉద్గారాలను తగ్గించే సంకల్పంతో చేపట్టిన అంటారిటికా యాత్రలో గ్రీన్ చాలెంజ్ వలంటీర్ అభిషేక్ శోభన్నకు చోటు దకింది. 35 దేశాల నుంచి 150 మంది సభ్యులు వెళ్లిన ఈ యాత్ర బృందంలో ప్రముఖ పర్యావరణ వేత్త రాబర్ట్ స్వాన్ కూడా ఉన్నారు. ఆయనకు భారత్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన హరిత ఉద్యమ వివరాలను వలంటీర్ తెలియజేశారు. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రశంసించిన రాబర్ట్ స్వాన్.. స్వయంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వలంటీర్ అభిషేక్ శోభన్నను అభినందించిన ఎంపీ సంతోష్కుమార్.. ట్విట్టర్ వేదికగా రాబర్ట్ స్వాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలను సందర్శించిన స్వాన్ చేతుల మీదుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ పతాకం ఆవిష్కరించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని వెల్లడించారు. మరింత చిత్త శుద్ధితో పర్యావరణ ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు.