అచ్చంపేట, ఏప్రిల్ 7 : నల్లమల భక్తుల శివనామస్మరణతో పులకించింది. సాహసయాత్ర, తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు. వీరంతా స్వామి దర్శనం అనంతరం శనివారం తెల్లవారుజామున తిరిగి రానున్నారు. చైత్రపౌర్ణమిని పురస్కరించుకొని దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల్లో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు మూడ్రోజులపాటు సుమారు 6 వేలకుపైగా వాహనాల్లో 4 లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చారు.
చివరి రోజు సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకొన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలు, బైక్లు, బస్సుల్లో తరలివచ్చారు. దట్టమైన అడవిలోకి వెళ్లాక వాహనాలను పార్క్ చేసి అక్కడి నుంచి కాలినడకన వెళ్లారు. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. వెళ్లొస్తాం.. లింగమయ్యా.. నామస్మరణతో మన్యం మార్మోగింది.